| 3. నారికేళపాకము: | | ఈ శ్రేణికి చెందిన కవిత్వమును అర్థంచేసుకుని ఆనందించాలంటే ఎక్కువగానే శ్రమపడవలసివుంటుంది. చదువరులకు సాధారణంగా ఒక పట్టాన కొరుకుడుపడేది కాదిది! దీనిని క్షుణ్ణంగా అవగతం చేసుకుని ఆస్వాదించడానికి సరిపడినంత భాషాజ్ఞానం, కొంత పాండితీప్రకర్ష ఆవశ్యకమని చెప్పక తప్పదు...... కొబ్బరికాయలోని మధురమైన స్వాదుజలమును రుచి చూడాలంటే ఎంత కష్టపడాలి! ముందు టెంకాయపైనున్న పీచునంతా తీసివేసి, తర్వాత లోనున్న పెంకును పగలగొడితేగాని, ఆ తీయని తేటనీరు మన అనుభవానికి రాదుకదా! | శ్రీహర్షుని "నైషధము" పైన పేర్కొన్న చివరి కోవకు, అనగా నారికేళపాకమునకు చెందినదట! అందుకే దానిని "విద్వదౌషధం" అన్నారు. మరి, ఇంతటి ప్రౌఢకావ్యమును సోమరిపోతులైన సామాన్యపాఠకులు ఎలా అర్థం చేసుకోగలరు? ఏమని మెచ్చుకోగలరు?..... అందువల్ల, అలాంటి మామూలు చదువరులు దానిని అభిమానించలేకపోవడములో ఆశ్చర్యమేమీ లేదంటున్నారు శ్రీనాథులు! అందుకు దృష్టాంతంగా మనోరంజకమైన ఒక చక్కని దృశ్యమును మన కట్టెదుట నిలుపుతున్నారు. నవయవ్వనం తొణికిసలాడుతున్న ఒక సొగసుకత్తె, ముక్కుపచ్చలారని ఒక పసివాని పాలబుగ్గలపై చిటిక వేస్తే, ఆ పాపడు అమాయకంగా బోసినవ్వులు వెలార్చడం తప్ప వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆ బాలుని మనసులో ఆ యువతి చేష్ట ఏవిధమైన కామవికారమును కలిగించలేదుకదా!.... కోరమీసముల కోడెగాడైతేనే ఆ జవరాలికి తగిన జవాబు చెప్పగలుగుతాడు. పై ఉదాహరణ ద్వారా శ్రీనాథుల రసికత్వం సైతం మనకు స్పష్టమౌతున్నది.
|
|